‘సమ్మక్క బ్యారేజీ’గా తుపాకులగూడెం బ్యారేజీ: సీఎం కేసీఆర్

గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత, వనదేవత.. ‘సమ్మక్క’’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు.. తుపాకులగూడెం బ్యారేజీకి  ‘సమ్మక్క బ్యారేజీ’ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఈ ఎన్ సీ మురళీధర్ రావును సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా వుండడం వల్లే తెలంగాణలో అభివృద్ది అనుకున్న రీతిలో సాగుతున్నదని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి,  తెలంగాణ బీడు భూముల్లోకి కాళేశ్వరం నీరు చేరుకుంటున్న శుభసందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు.


గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం, ప్రాజెక్టు దిగువన నిర్మించిన బ్యారేజీలను సీఎం హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. బుధవారం ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న విధంగా సాగునీరు చేరుకుంది. కాళేశ్వరం దిగువన నిర్మించిన బ్యారేజీలు నిండుకుండలా మారాయని సీఎం హర్షం వ్యక్తం చేశారు. వచ్చే వర్షాకాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుందనీ, ప్రాణహిత ద్వారా లక్ష్మీ బ్యారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసి, కాలువలకు మల్లించే దిశగా.. ఇరిగేషన్ శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం కావాలని సీఎం సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు తెలిపారు.